అరవయ్యేళ్ళ కిందటి వరకు అన్నమయ్య గురించి చాలామంది పండితులకు సైతం తెలియదు. చరిత్రపుటల్లో ఆయన పేరు చూడడమే తప్ప ఆయన సాహిత్య స్వరూపం గురించి, సంగీతం గురించి తెలియదు. మరి ఇప్పుడు ఆంధ్రదేశంలోనే కాదు దేశమంతటా, ప్రపంచమంతటా ఆయన పాటలు మారుమ్రోగుతున్నాయి. ఇందుకు కారణం ఒక తెలుగు సాహితీ కృషీవలుడు... ఆయనే
శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి
ఇందులో కొన్ని ముఖ్యమైన భాగాలు ఇక్కడ చదవండి.
మొత్తం వ్యాసం చదవాలంటే ఈ లింకు నొక్కండి:
1939లో మద్రాసునుంచి తిరుపతికి వచ్చి స్థిరపడిన తర్వాత శాస్త్రిగారి సాహిత్య కృషి కొత్త మలుపు తిరిగింది. తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయం ఆవరణలోని ఒక నేల మాళిగలో నాలుగు శతాబ్దాలుగా దాగి ఉన్న తాళ్ళపాక వాగ్గేయకారుల సంకీర్తనలు గల రాగిరే కులను గుర్తించి, బయటికి తీయించి 1948లో వాటిని దేవస్థానం చేత ప్రచురింపజేశారు.
మొత్తం 29 సంపుటాలుగా వెలువడిన ఆ సాహిత్యంలో మొదటి ఐదు సంపుటాల ప్రచురణ ఆయన పర్యవేక్షణలోనే జరిగింది. అన్నమయ్య 32 వేల కీర్తనలు రచించగా వాటిలో 11 వేల కీర్తనలు మాత్రమే లభ్యమయ్యాయి.
రాగిరేకుల మీది సంకీర్తనలకు స్వరాలు లేవు. వాటికి రాగతాళాల పేర్లు మాత్రమే పేర్కొనబడినాయి.
రాగిరేకుల సంగతి ఇలా ఉండగా, తిరుమల ఆలయ చంపక ప్రదక్షిణ ప్రాకారం వద్ద కొన్ని శతాబ్దాలుగా అజ్ఞాతంగా పడి ఉన్న రెండు పెద్ద రాతి బండలు 1949లో ప్రభాకరశాస్త్రిగారి దృష్టికి వచ్చాయి. వాటిపై కొన్ని స్వరసహిత సంకీర్తనలు చెక్కి ఉన్నాయి.
అవి క్రీ. శ. 1500 ప్రాంతం నాటి తాళ్ళపాక వాగ్గేయకారుల రచనలై ఉంటాయనీ, బహుశా అన్నమయ్యవే కావచ్చుననీ శాస్త్రిగారు అభిప్రాయపడ్డారు. అంతేకాదు యావత్ప్రపంచంలోనే ప్రప్రథమంగా లభించిన స్వరసహిత వాగ్గేయ రచనల శిలాలేఖములని కూడా ఆయన భావించారు. త్వరలో వాటిని నిశితంగా పరిశీలించి, పరిష్కరించి ప్రకటించాలని ఆయన సంకల్పించారు. కాని, ఆ పని జరిగేలోపునే - 1950లో - ఆయన దివంగతులైనారు.
సాధారణంగా బండలపై అక్షరాలు చెక్కేవారు ముందుగా వాటిని నునుపు చేస్తారు. కాని, ఈ సంకీర్తనలు చెక్కిన బండలు నునుపుగా లేకుండా ఎగుడు దిగుడుగా ఉన్నాయి. వాటి మీది అక్షరాలను గుర్తించడం కష్టం. దేవస్థానం వారు ఆ బండలకు ఫోటోలు తీయించడం, లిపి శాస్త్రజ్ఞులు వాటిని నిశితంగా పరిశీలించి అక్షరాలను కాగితాల మీదికి ఎక్కించడం, కనిపించకుండా పోయిన భాగాలను మరొక తరహా పండితులు పూరించడం, సంగీత విద్వాంసులు స్వరసాహిత్య సమన్వయాన్ని సాధించడం, వీరంతా చర్చలు జరిపి గ్రంథాన్ని ప్రచురించడం - ఈ దశలన్నీ 1999 నాటికి పూర్తయినాయి.
అయినా, 'ప్రథమోపలబ్ధ స్వరసహిత సంకీర్తన శిలాలేఖము' అనే పేరుతో దేవస్థానం వెలువరించిన ఆ గ్రంథం ప్రతులు సంపాదక వర్గం వారికి, దేవస్థానం అధికారులలో కొందరికి లభించాయే గాని మార్కెట్లోకి రాలేదు. అసలా పుస్తకాన్ని తాము ఎప్పడూ చూడలేదని దేవస్థానం వారి పుస్తక విక్రయశాలల వారే చెబుతున్నారు. ఏమైనాయి అవన్నీ?
పూర్తి వ్యాసం చదవాలంటే ఇక్కడికి వెళ్ళండి

No comments:
Post a Comment